రాష్ట్రంలోని రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా తప్పులు లేని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భూ రికార్డుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. రికార్డులను ఎవరూ మార్చడానికి వీలులేకుండా అత్యున్నత సాంకేతికతతో, క్యూఆర్ కోడ్ (QR Code) మరియు రాజముద్రతో పాస్ పుస్తకాలను రూపొందించారు.
ముద్రణకు ముందే గ్రామసభలు నిర్వహించి, రైతుల సమక్షంలో వివరాలను సరిచూసుకోవాలి. భూ యజమాని అనుమతి లేకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరగవు. ఇది రైతులకు ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద హామీ. జనవరి 2 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6.07 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే పాస్ పుస్తకాలు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
