తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులు పామాయిల్, ప్రమాదకర రసాయనాలతో కూడిన ‘సింథటిక్’ ద్రవాన్ని వాడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం సీఎం చంద్రబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన గణాంకాలతో సహా గత ప్రభుత్వ అపచారాలను ఎండగట్టారు.

TTD 59.70 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసిన ఒక కంపెనీ, అదే సమయంలో 58 లక్షల కిలోల పామాయిల్, 2 లక్షల కిలోల రసాయనాలు కొనుగోలు చేసిందని.. ఆ మిశ్రమంతోనే లడ్డూలు తయారు చేశారని ఆధారాలు బయటపెట్టారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలను కూడా ఇదే కల్తీ నెయ్యితో తయారు చేసి హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో నూనె ధర కంటే తక్కువకు ఆవు నెయ్యి ఎలా వస్తుందని తెలిసినా, గత పాలకులు నాణ్యతను గాలికొదిలేశారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కించపరిచిన వారు ఎంతటి వారైనా సరే, చట్టం ముందు మోకరిల్లే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు.”సిట్ నివేదికను వైసీపీ నేతలు తప్పుగా వాడుకుంటున్నారని, సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని” ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
