శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి రిమ్స్, కిమ్స్, జెమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

డయేరియా వల్ల ఒక్కరు మాత్రమే మృతి చెందారని, వైసీపీ నేతలు నలుగురు చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పటివరకు 124 కేసులు నమోదయ్యాయని, 22 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. నాలుగు సచివాలయాల పరిధిలోనే కేసులు కంట్రోల్ అయ్యాయని, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.
శ్రీకాకుళం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు.
మున్సిపల్ కమిషనర్ కూర్మారావు సస్పెన్షన్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అంగీకరించారు. ఆయన పనితనంపై నమ్మకంతోనే తాము తెచ్చుకున్నామని, మళ్ళీ ఆయన సేవలను వాడుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
