సత్తెనపల్లి పట్టణంలోని క్రిస్టియన్పేటలో ఈ నెల 8న జరిగిన ఒక మహిళా అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరిగా నివసిస్తున్న రమాదేవి అనే మహిళ ఒళ్లంతా కాలిన గాయాలతో సజీవ దహనమైన ఘటనలో.. ఆమె కన్నకూతురే నిందితురాలని విచారణలో తేలడం సంచలనంగా మారింది.
కుటుంబ గొడవలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ఈ నెల 8న తల్లి రమాదేవికి టీలో ‘సిట్రజన్’ (మత్తు నిచ్చే) టాబ్లెట్లు కలిపి ఇచ్చింది. తల్లి గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత, ఆమె ఒంటిపై చీరలు వేసి, పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పరారైంది. తల్లి చనిపోయిన సమాచారం ఇచ్చినా కుమార్తె స్పందించిన తీరు పోలీసులకు అనుమానం కలిగించింది. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఘటన సమయంలో ఆమె అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయింది.పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఆస్తి గొడవలా లేక మరే ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
