ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం విద్యార్థుల రాకతో కోలాహలంగా మారాయి. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ గ్యాలరీ నుండి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రజాప్రతినిధుల మధ్య జరిగే చర్చలు, ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు, సభ సాగే తీరును విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు.
సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విద్యార్థులను కలిసి ముచ్చటించారు. వారితో కలిసి గ్రూపు ఫోటోలు దిగి, విద్యార్థులను ఉత్సాహపరిచారు.
అసెంబ్లీని నేరుగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రత్యక్షంగా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.
తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.
