ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రోహిణి కార్తె ప్రభావంతో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే మూడు నెలలుగా ప్రజలు ఉక్కపోత, వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నారు. మరో పది రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో హీట్వేవ్ కొనసాగుతుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో ప్రస్తుతం 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవి మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ 40 డిగ్రీల మార్క్ దాటింది.
మరోవైపు, నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

