రాజమండ్రి పరిసర ప్రాంతాలను గజగజలాడించిన పెద్దపులి ఇప్పుడు మన్యం వైపు మళ్లింది. ఇటీవల కూర్మాపురంలో బంధించిన ఈ పులిని, చికిత్స అనంతరం అధికారులు పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే, ప్రస్తుతం ఈ పెద్దపులి రంపచోడవరం, మారేడుమిల్లి మండల సరిహద్దుల్లోని గిరిజన గ్రామాల్లో సంచరిస్తుండటంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు.
సీమగండి, సున్నం పాడు, డివి కోట, రంప, మరివాడ, పెదకొండ గ్రామాల్లో పులి కదలికలను అధికారులు గుర్తించారు. గిరిజనులు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, అటవీ ఫలసాయం సేకరించేందుకు వెళ్లడం ప్రస్తుతానికి మానుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పులికి అమర్చిన జీపీఎస్ (GPS) ట్రాకర్ ద్వారా దాని కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి జాడ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
