వికలాంగులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చైతన్యం నింపే లక్ష్యంతో ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఏర్పడిందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని బెహరా మనోవికాస కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి, వారిని సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిందని హరిబాబు తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు వికలాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించిందని, వారి హక్కుల పరిరక్షణ కోసం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
“వివక్షత లేని సమాజ స్థాపన మనందరి బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమానికి ముందు మనోవికాస కేంద్రంలోని వికలాంగులతో ముచ్చటించి, నిర్వాహకులను సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
