సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాల వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోందని, దీనిపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మౌనంగా ఉండటం దారుణమని ఆమె మండిపడ్డారు.
“చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు జగన్ కూడా బీజేపీకి అమ్ముడుపోయారు. జగన్ కేవలం బీజేపీకి దత్తపుత్రుడు మాత్రమే కాదు, ఆయన ఆ పార్టీకి బినామీలా వ్యవహరిస్తున్నారు” అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం పేరు మార్చి, నిధులు తగ్గిస్తుంటే.. ఆయన తనయుడిగా జగన్కు కనీసం ఎదిరించే సత్తా లేదని విమర్శించారు.గత ఐదేళ్ల జగన్ పాలన, ప్రస్తుత చంద్రబాబు పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పక్షాన నిలబడుతుందని, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
