మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉన్న 202వ జాతీయ రహదారి (NH-202) పై శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు సరుకు రవాణా వాహనాలపై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక ట్రక్ డ్రైవర్ బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. వాహనానికి భద్రతగా ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ కాలికి కూడా తుపాకీ గాయమైంది. మెరుగైన చికిత్స కోసం అతడిని ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించారు.
ఉఖ్రుల్ జిల్లాలోని లిటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లీన్గ్యాంగ్చింగ్, టీఎస్ కాసమ్ అనే ప్రాంతాల మధ్య ఈ దాడి జరిగింది. ఇటీవలి కాలంలో నాగా, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రాంతం ఇది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిత్యావసర వస్తువులను తీసుకువచ్చే డ్రైవర్ల ప్రాణాలు తీయడం అత్యంత పిరికిపంద చర్య అని, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలను అడ్డుకోవడానికే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మృతుడి కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

