కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు గురువారం (ఫిబ్రవరి 12, 2026) జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తగరపువలస జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్మికులు జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ను స్తంభింపజేశారు.
కార్మికులను కట్టుబానిసలుగా మార్చే నూతన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి నెలకు రూ. 26,000 కనీస వేతనం చెల్లించాలి.
అన్ని రకాల సెలవులు, ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పని చేస్తోందని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని, కేవలం రాజకీయ వివాదాలపైనే కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు. “కార్మికులకు అన్యాయం జరిగితే రేపు రాష్ట్రవ్యాప్తంగా రైళ్లు, బస్సులు నిలిపివేస్తాం.. ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తాం” అని వారు హెచ్చరించారు.
