ఇంట్లో ఎవరూ లేని సమయంలో లాకర్ బద్దలు
- అస్సాంలోని జోర్హాట్లో సొంత ఇంట్లోనే రూ.50 లక్షల నగదు, బంగారం చోరీ చేసిన 25 ఏళ్ల యష్ ధనుకా అగర్వాల్.
- చోరీ చేసిన డబ్బుతో ప్రియురాలు పుబాలి దత్తాకు రూ.1.5 లక్షల ఐఫోన్ కొనడంతో పాటు హోటళ్లు, రిసార్టుల్లో జల్సాలు.
- మొబైల్ సిగ్నల్ ఆధారంగా అహ్మదాబాద్లో కుమారుడిని గుర్తించిన తండ్రి.. స్వయంగా వెళ్లి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగిందంటే?
అస్సాంలోని జోర్హాట్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం ఆగస్టు 11న పనిమీద బయటకు వెళ్లింది. అదే సమయంలో వారి ఇంట్లో చోరీ జరిగింది.
కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి లాకర్లోని రూ.50 లక్షల నగదు, బంగారం కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. దొంగ నేరుగా గదిలోకి వచ్చి లాకర్ను తెరిచినట్లు ఆధారాలు గుర్తించారు. దీంతో ఇంట్లోని వ్యక్తులపై కూడా అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో వ్యాపారవేత్తకు తన 25 ఏళ్ల కుమారుడు యష్ ధనుకా అగర్వాల్పై అనుమానం వచ్చింది.
కుటుంబం బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో యష్ ఒక్కడే ఉన్నాడని, ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంటుందో అతడికి తెలుసని తండ్రి పోలీసులకు చెప్పారు.
చోరీ తర్వాత యష్ ఇంట్లో లేకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
మొబైల్ సిగ్నల్తో అహ్మదాబాద్లో గుర్తింపు
పోలీసులు యష్ మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేయగా.. అతడు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో తండ్రి స్వయంగా అహ్మదాబాద్ వెళ్లారు.
అక్కడ యష్ తన ప్రియురాలు పుబాలి దత్తాతో కలిసి ఓ విలాసవంతమైన హోటల్లో ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే కుమారుడిని అదుపులోకి తీసుకుని అస్సాంకు తీసుకొచ్చారు. అనంతరం జోర్హాట్ పోలీసులకు అప్పగించారు.
ప్రియురాలికి రూ.1.5 లక్షల ఐఫోన్
పోలీసుల విచారణలో యష్ తన నేరాన్ని అంగీకరించాడు. తానే ఇంట్లోంచి రూ.50 లక్షలు దొంగిలించినట్లు చెప్పాడు. అందులో రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించాడు.
చోరీ చేసిన డబ్బుతో ప్రియురాలు పుబాలి దత్తాకు రూ.1.5 లక్షల ఐఫోన్ కొనిచ్చినట్లు అంగీకరించాడు.
ఆమెకు నగదు కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో పాటు పలు హోటళ్లు, రిసార్టుల్లో బస చేస్తూ విలాసవంతంగా గడిపినట్లు వెల్లడించాడు.
స్నేహితులే ప్లాన్ చేశారని వెల్లడి
ఈ చోరీకి తాను ఒక్కడే ప్లాన్ చేయలేదని యష్ పోలీసులకు చెప్పాడు. తన స్నేహితులు జితు సోమాని, రోహిత్ ప్రసాద్లు దొంగతనానికి పథకం వేశారని తెలిపాడు.
వారి మాటలు విని తాను ఈ తప్పిదానికి పాల్పడ్డానని చెప్పాడు.
ఇంట్లోని లాకర్ తెరుచుకోకపోవడంతో తాళాలు తయారు చేసే వ్యక్తి సాయంతో దాన్ని బద్దలు కొట్టినట్లు యష్ వెల్లడించాడు. అనంతరం నగదు, నగలను తీసుకెళ్లినట్లు చెప్పాడు.
ఈ కేసులో పుబాలి దత్తాను నిందితురాలిగా చేర్చలేదు. అయితే ఆమెను కూడా విచారించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న జితు సోమాని, రోహిత్ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జోర్హాట్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారత్ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు. యష్ను న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.



