ఘటన స్థల పునర్నిర్మాణంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసుల వెల్లడి
మరో నిందితుడి అరెస్ట్.. కేసులో మొత్తం అరెస్టులు నాలుగుకు చేరిక
Kolkata: Bengal’s Baruipur లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మండల్ బుధవారం తెల్లవారుజామున పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
ఘటన స్థల పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో పోలీసు అధికారి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ను లాక్కొని కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. బాలిక హత్యపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రభాస్ మండల్ను దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సూర్జ్యాపూర్ ప్రాంతానికి అర్ధరాత్రి తర్వాత తీసుకెళ్లారు.
ఘటన జరిగిన తీరు పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడు పోలీసు తుపాకీ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు.
ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడని, దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు.
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన నిందితుడి తల్లి:
కాల్పుల్లో గాయపడిన ప్రభాస్ మండల్ను బరుయిపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ప్రభాస్ మండల్ మృతదేహాన్ని స్వీకరించేందుకు అతడి తల్లి సంధ్యా మండల్ నిరాకరించారు. తన కుమారుడు చేసిన పనికి తగిన ఫలితం పొందాడని ఆమె మీడియాతో చెప్పారు.
ఇదే సమయంలో మరో నిందితుడు కబీర్ మొల్లాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), బరుయిపూర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), జిల్లా పోలీసులు సంయుక్తంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో అరెస్ట్ చేశారు.
కబీర్ మొల్లాను విచారణ కోసం బరుయిపూర్కు తరలించారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది.ఇంతకుముందే ప్రభాస్ మండల్తో పాటు ఆనంద్ సర్దార్, దిబాకర్ సర్దార్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
జూలై 4న కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలిక మృతదేహం మరుసటి రోజు సూర్జ్యాపూర్ హాట్ ప్రాంతంలోని చెరువులో లభించింది.
బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి చెరువులో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు బరుయిపూర్-జోయ్నగర్ రోడ్డును దిగ్బంధించారు. టైర్లు దహనం చేసి, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.
బాలిక మృతదేహం లభించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. అయితే ఆ వ్యక్తికి ఈ కేసుతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారం బరుయిపూర్ను సందర్శించి సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అత్యాచారం-హత్య కేసుపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ సిద్ధనాథ్ గుప్తాకు ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో తమ ప్రభుత్వం “జీరో టాలరెన్స్” విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు.
నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసానికి సంబంధించి వీడియోల ఆధారంగా సుమారు 200 మందిని పోలీసులు గుర్తించారని ఆయన వెల్లడించారు.
పోలీసులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుల్లో ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిపై కూడా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



