తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల సెంటిమెంట్లతో ఆడుకుంటోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మండలి వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన ‘ఇందాపూర్ డెయిరీ’కి, సీఎం కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’కు మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సొంత కంపెనీల లాభం కోసమే లడ్డూపై అపవాదు వేశారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పార్టీ ప్రతినిధిలా కాకుండా, ఆలయ ప్రతిష్టను కాపాడేలా వ్యవహరించాలని సూచించారు. లడ్డూ కల్తీ అంశంపై చర్చకు ప్రభుత్వం భయపడి సభను గందరగోళం చేసి పారిపోతోందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా వంటి పథకాలను అటకెక్కించి, కేవలం వైకాపా నేతలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
