సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తన భార్య, కుమార్తెతో కలిసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో మేడారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుండి ఈడ్చుకెళ్లారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు.తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలో ఎక్కించి అక్కడి నుండి తరలించారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన భార్య మరియు కుమార్తెతో కలిసి కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు. తమకు దైవ దర్శనం చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.MLA పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును BRS నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
