సుదీర్ఘ కాలం పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కథ విషాదాంతమైంది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సిబిఐ (CBI) దాఖలు చేసిన నివేదికను కోర్టు ఆమోదించడంతో ఈ కేసు అధికారికంగా ముగిసింది.
2019 డిసెంబర్ 14న రీ-పోస్టుమార్టం కోసం విజయవాడ సిబిఐ కోర్టు వెలికితీసిన ఆయేషా శరీర అవశేషాలను శుక్రవారం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం ద్వారా ఈ అవశేషాలను విజయవాడ నుంచి తెనాలికి తరలిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్లో గతంలో ఆమెను ఖననం చేసిన ప్రాంతంలోనే ఈ అవశేషాలను తిరిగి ఖననం చేయనున్నారు.తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని, అసలైన దోషులు దొరుకుతారని 18 ఏళ్లుగా ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషా సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. నిందితులు ఎవరో తేలకుండానే కేసును మూసివేయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థల వైఫల్యం వల్లే తమకు అన్యాయం జరిగిందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
