లండన్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరుపుతున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించేందుకు ఆయన ఈ భేటీలను నిర్వహిస్తున్నారు.
సోమవారం ఆయన అక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, హిందూజా గ్రూప్ ఛైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజా, రోల్స్ రాయిస్ చీఫ్ ట్రాన్సఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ-గ్రాడీ స్మిత్, శ్రామ్ అండ్ మ్రామ్ ఛైర్మన్ శైలేష్ హీరానందాని, శ్యామ్ కో హోల్డింగ్స్ ఛైర్మన్ సంపత్ కుమార్, అలాగే కొసరాజు గిరిబాబు తదితరులతో సమావేశం కానున్నారు.
తరువాత సీఐఐ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీఎం పాల్గొంటారు. ఇందులో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్, ఏథెనియన్ టెక్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫెనీ ఇన్సిట్యూట్, వార్విక్ మాన్యుఫాక్చరింగ్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.అదనంగా, ఇండియన్ హైకమిషనర్ దొరైస్వామితో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నారు.
