పాయకరావుపేట నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చొరవతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విద్యార్థులు, భక్తుల నడుమ విజయవంతంగా నిర్వహించబడింది. S.రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురం వద్ద చాగంటి కోటేశ్వరరావు గారికి హోం మంత్రి అనిత ఘన స్వాగతం పలికారు. ‘విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి’ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులకు చాగంటి వారు వ్యక్తిత్వ వికాసంపై మార్గనిర్దేశం చేశారు.

“అమ్మ కంటే గొప్ప దైవం లేదు.. మనిషి విగ్రహంలా మారాలంటే ఉలి దెబ్బలు (కష్టాలు) తప్పవు” అని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సెల్ఫోన్కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నైతిక విలువలతో కూడిన సమాజం కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, చాగంటి వారి మాటలు భావి తరానికి బంగారు బాటలని మంత్రి అనిత పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చాగంటి వారు తమదైన శైలిలో సమాధానాలిచ్చి వారిలో స్ఫూర్తిని నింపారు.
