చింతపల్లి మండలంలో గిరిజన రైతుల కోసం నిర్మించిన మార్కెట్ యార్డు ప్రస్తుతం దుర్వినియోగానికి గురవుతోంది. పంచాయతీ మరియు NABARD నిధులతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సంత షెడ్లు, వ్యాపార అవసరాలకు ఉపయోగపడాల్సిన చోట ఆకతాయిలకు, మద్యం సేవించే వారికి అడ్డాగా మారాయి.

ప్రతి బుధవారం జరిగే వారపు సంతకు వందలాది మంది రైతులు వస్తున్నప్పటికీ, షెడ్లలో పేరుకుపోయిన చెత్త, ఖాళీ మద్యం సీసాలు, దుర్వాసన కారణంగా అక్కడ వ్యాపారం చేయడం కష్టంగా మారింది. దీంతో రైతులు రహదారి పక్కనే దుమ్ము, ధూళిలో తమ ఉత్పత్తులను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో పంచాయతీ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా, రైతుల నుంచి ‘ఆసీలు’ పేరుతో పన్నులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది.స్థానికులు వెంటనే స్పందించి మార్కెట్ను శుభ్రపరచాలని, ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
