అల్లూరి జిల్లా చింతపల్లిలో పోలీసులు భారీగా ద్రవరూప గంజాయిని (హాసిష్ ఆయిల్) స్వాధీనం చేసుకున్నారు. లోతుగెడ్డ బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థం బయటపడింది.
సుమారు 11.440 కిలోల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1.43 కోట్లు ఉంటుందని అంచనా. పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు స్కూల్ బ్యాగులో మత్తు పదార్థాన్ని పెట్టి బైక్పై తరలిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. లమ్మడంపల్లికి చెందిన బోనంగి జకరియా, బోనంగి ధనబాబులను అదుపులోకి తీసుకున్నారు. ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న కీలక సూత్రధారి బోనంగి మార్క్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని సీఐ వినోద్ బాబు తెలిపారు.నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
