ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ కీలక హామీలు ఇచ్చారు.

ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్లకు పైగా గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం ప్రకటించారు. ఉగాది నాటికే 3 లక్షల ఇళ్లు సిద్ధమవుతాయని తెలిపారు. ఇళ్లు లేని 2.20 లక్షల కుటుంబాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామన్నారు. ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ రంగంలో జరిగిన అక్రమాలను వదిలిపెట్టబోమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వ్యవసాయ రంగం – పంచ సూత్రాలు:
ఎన్నికల హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని (రాష్ట్ర వాటా రూ. 14,000 + కేంద్రం రూ. 6,000) సీఎం గుర్తుచేశారు. అగ్రిటెక్, ఏఐ (AI) సేవలను సాగులోకి తెచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఈ బడ్జెట్లో రూ. 13,722 కోట్లు కేటాయించామన్నారు. రాయలసీమను లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ. 1.50 కే అందిస్తూ రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా మారుస్తామన్నారు.
