ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.

గ్రామీణ రోడ్ల అభివృద్ధి, జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి మరియు నిధుల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించారు. నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపులపై పవన్ కళ్యాణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ అమలుపై సమీక్షించారు. వేసవి కాలంలోనే నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడిక తీత పనులు చేపట్టాలని పవన్ కోరారు. రైతులు పంటలు వేసేలోపు ఈ పనులు పూర్తి కావాలని సూచించారు. అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి పనుల వేగవంతంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

