రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బాణసంచా ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉండవల్లిలో ఆర్టీజీఎస్ (RTGS), ప్రజాభిప్రాయంపై నిర్వహించిన సమీక్షలో పలు శాఖల పనితీరుపై ఆయన దిశానిర్దేశం చేశారు.

బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాల అధ్యయనం కోసం అధికారుల బృందం తమిళనాడులోని శివకాశీకి వెళ్లి రావాలని సీఎం సూచించారు. ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.పుంగనూరు, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు వంటి ప్రధాన బస్టాండ్లలో కనీస సౌకర్యాలు (టాయిలెట్లు, తాగునీరు) లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఇబ్బందులు వెంటనే తొలగించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అట్టడుగు ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు ఉండకూడదని, ‘స్వర్ణ గ్రామాలు’ లక్ష్యంగా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ‘దీపం’ పథకం కింద గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖను హెచ్చరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి తావుండకూడదని, నిజాయితీ కలిగిన అధికారులకే పోస్టింగ్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘వాట్సప్ మనమిత్ర’ సేవలపై అవగాహన పెంచాలని సూచించారు.అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
