ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు.
వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించినట్లుగా స్పష్టం చేశారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును కలిపే 12 లేన్ ఎక్స్ప్రెస్వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు.


