జిమ్ ట్రైనర్ ఇమ్రాన్పై కుటుంబ సభ్యుల అనుమానం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 21 ఏళ్ల యువతి, పార్ట్టైమ్ మోడల్ ముస్కాన్ను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో ఉన్న న్యూ మహావీర్ నగర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఇంట్లో ఒంటరిగా ఉండగా దాడి
ముస్కాన్ స్టూడెంట్గా ఉంటూనే మోడలింగ్ చేస్తోంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి రెండో అంతస్తులో బుధవారం ఒంటరిగా ఉంది.
అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.
ముస్కాన్ కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
రక్తపు మడుగులో ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన కత్తి గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
ఇమ్రాన్పై కుటుంబ సభ్యుల అనుమానం
ఈ హత్య వెనుక ముస్కాన్ వెళ్లే జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్న ఇమ్రాన్ ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత ఒకటి, ఒకటిన్నర సంవత్సరాలుగా ముస్కాన్కు ఇమ్రాన్తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇమ్రాన్ కొంతకాలంగా ముస్కాన్ను వేధిస్తుండటంతో ఆమె అతడిని దూరం పెట్టినట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.
ఘటన జరిగినప్పటి నుంచి ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇమ్రాన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అభిషేక్ గుప్తా తెలిపారు.
ముస్కాన్ సోదరుడు కూడా ఇమ్రాన్పైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.



