భారత విమానయాన రంగంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించే దిశగా మంత్రి నారా లోకేష్ కీలక అడుగు వేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన ‘చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్’ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పైలట్ క్యాడెట్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించి, వారిలో ఉత్సాహాన్ని నింపారు.

అమెరికాలోని అట్లాంటా పర్యటనలో కలిగిన ఆలోచనే నేడు ఈ సంస్థ ఏర్పాటుకు పునాది అని లోకేష్ వెల్లడించారు.వేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయాన రంగానికి కావాల్సిన అత్యుత్తమ ప్రతిభావంతులను తయారు చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నేపథ్యంలో యువ పైలట్లతో జరిపిన సంభాషణ అద్భుతంగా సాగిందని, విమానయాన భవిష్యత్తు వారి కళ్లలో కనిపిస్తోందని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. విమానయాన రంగం కేవలం రవాణాకే కాదు, ఉపాధి కల్పనలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు

