ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
- ఢిల్లీలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- హత్యను దొంగలపై నెట్టేందుకు ప్రయత్నించిన మంజు
- సీసీ కెమెరా ఆధారాలతో అసలు విషయం బయటపెట్టిన పోలీసులు
భర్తను చంపి దొంగలపై నెపం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివాహేతర సంబంధం కారణంగా ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది.
అనంతరం ఇంట్లో దొంగలు పడ్డారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో తన భర్తపై దాడి చేసి చంపేశారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
దీంతో భార్యతో పాటు ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మున్నాలాల్ తన భార్య మంజుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మున్నాలాల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తుండగా.. మంజు ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకునేది.
ఈ క్రమంలో మంజుకు చమన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ మంజు తన భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం ప్రియుడు చమన్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.
ఈ నెల 10వ తేదీన తాగునీటిలో మత్తుమందు కలిపి మున్నాలాల్కు ఇచ్చింది. అనంతరం చమన్తో కలిసి అతని గొంతు నొక్కింది. కరెంట్ షాక్ ఇచ్చి, కర్రతో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సీసీ కెమెరాలతో బయటపడిన నిజం
భర్తను హత్య చేసిన తర్వాత మంజు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మున్నాలాల్ ఒంటిపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు అనుమానం వచ్చింది.
అయితే ఇంట్లో దొంగలు పడ్డారని మంజు చెప్పింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భర్తపై దొంగలు ఎదురుదాడి చేసి చంపేశారని పోలీసులకు వివరించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు.
తెల్లవారుజామున 3:15 గంటలకు అతడు బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది.
దీంతో మంజు చెప్పిన మాటలపై పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. ఆమెను తమదైన రీతిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు చమన్తో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు మంజు అంగీకరించింది.
రూ.5 లక్షలకు ఒప్పందం.. రూ.20 వేలు చెల్లింపు
భర్తను హత్య చేసేందుకు ప్రియుడు చమన్కు రూ.5 లక్షలు ఇస్తానని మంజు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తర్వాత అతనికి రూ.20,000 కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మంజుతో పాటు ఆమె ప్రియుడు చమన్, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముగ్గురినీ రిమాండ్కు తరలించారు.



