“భూమి మనిషికే కాదు, జంతువులకు కూడా సొంతం” అనే వసుధైక కుటుంబం భావనతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.వన్యప్రాణి సంఘర్షణను ‘కాన్ఫ్లిక్ట్’ నుంచి ‘కో-లివింగ్’ (సహజీవనం) వైపు మలచడమే “ప్రాజెక్ట్ హనుమాన్” ప్రధాన ఉద్దేశమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్లో ఈ వినూత్న ప్రాజెక్టును ఆయన ఘనంగా ప్రారంభించారు.

చిత్తూరు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లో ఏనుగులు, ఇతర వన్యప్రాణుల వల్ల కలిగే పంట, ప్రాణ నష్టాన్ని శాస్త్రీయంగా అరికట్టడం. రాష్ట్రవ్యాప్తంగా 100 వాహనాలను ప్రారంభించారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ వాహనాలు, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సులు ఉన్నాయి. ఏఐ (AI) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, జీపీఎస్ ట్రాకింగ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన వారికి ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గాయపడిన వారికి ₹2 లక్షలు అందజేస్తారు.కర్ణాటక ప్రభుత్వ సహకారంతో 4 కుంకీ ఏనుగులను వినియోగిస్తున్నామని, ఇప్పటికే 8 ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని వెల్లడించారు.అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖలు సమన్వయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి.

