డీఎంకే-వీసీకే మధ్య కవితల పోరు

May 22, 2026 12:51 PM

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రచ్చగా మారింది. డీఎంకే, దాని మాజీ మిత్రపక్షం వీసీకే మధ్య కవితల రూపంలో విమర్శలు సాగాయి. వీసీకేకు మద్దతుగా టీవీకే కూడా ఘాటుగా స్పందించింది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి వీసీకే మద్దతు ఇవ్వడమే ఈ వివాదానికి కారణమైంది.

డీఎంకే ఎంపీ ఏ రాజా సోషల్‌మీడియాలో చేసిన పోస్టుతో వివాదం మొదలైంది. తమిళ సాహిత్యంలో “వంగిన కొబ్బరి చెట్టు” అనే రూపకాన్ని ఆయన ప్రస్తావించారు. తాను పెరిగిన నేల నుంచి వంగి పక్కింటివారికి ఫలాలు అందించే చెట్టుగా దాన్ని పోలుస్తారు. ఎన్నికల్లో డీఎంకే కూటమి మద్దతుతో రెండు స్థానాలు గెలిచిన వీసీకే, ఇప్పుడు టీవీకే వైపు వెళ్లడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

నా ఇంటి తోటలోని కొబ్బరి చెట్టు వంగి ఎదుటి ఇంటికి నీళ్లు ఇస్తే సాహిత్యంలో దానికి ఒక పేరు ఉంటుంది. రాజకీయాల్లో దాన్ని ఏమని పిలవాలి?” అని రాజా పోస్టు చేశారు.

మరో పోస్టులో పెరియార్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ “పరిస్థితులు మారే వరకు ఎదురుచూస్తాం. కానీ పోరాటం ఆగదు. విజయం మాదే అవుతుంది” అని పేర్కొన్నారు.

ఇక రాజా చేసిన మరో అసభ్యకర పోస్టు తీవ్ర విమర్శలకు దారితీయడంతో ఆయన దాన్ని తొలగించారు.

2021లో తిరుపోరూర్ స్థానం నుంచి గెలిచిన ఎస్‌ఎస్ బాలాజీ డీఎంకే వ్యాఖ్యలకు కవిత రూపంలో సమాధానం ఇచ్చారు. అణగారిన వర్గాల పార్టీ ఎదుగుదల చూసి ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు.

“సాధారణ ప్రజలకు అధికారమంటే ఎందుకు ఆగ్రహం?
అసహాయతే అపవాదులు విసురుతోంది.
అసభ్యత దాటేసి ముందుకు వెళ్లండి.
అన్యాయం కొనసాగితే మంటలు ఆరిపోవు…” అని ఆయన వ్యాఖ్యానించారు

డీఎంకే నేతల వ్యాఖ్యలు రాజకీయ మర్యాద దాటిపోయాయని టీవీకే విమర్శించింది. అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం డీఎంకే అహంకారానికి నిదర్శనమని పేర్కొంది.

“సామాజిక న్యాయం కోసం నిలబడే పార్టీలను బెదిరించే ధోరణి డీఎంకే అసలు స్వభావాన్ని బయటపెడుతోంది. కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదుగుతుండటంతో డీఎంకే నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోయారు” అని టీవీకే పోస్టు చేసింది.

గత నెల జరిగిన ఎన్నికల్లో డీఎంకే-వీసీకే కలిసి పోటీ చేశాయి. కానీ అంచనాలకు విరుద్ధంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 234 స్థానాల్లో 108 గెలిచి సంచలనం సృష్టించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి ఇది పెద్ద దెబ్బగా మారింది.

అయితే మెజారిటీకి 118 స్థానాలు అవసరం కావడంతో టీవీకేకు మద్దతు అవసరమైంది. కాంగ్రెస్ ఐదు స్థానాలతో మద్దతు ఇచ్చింది. తర్వాత వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వామపక్షాలు మద్దతుపై చర్చలు జరిపాయి.

మొదట బయట నుంచి మద్దతు ఇస్తామని భావించిన వీసీకే, తర్వాత ప్రభుత్వంలో చేరి మంత్రి పదవులు తీసుకోవాలని నిర్ణయించింది. ఇదే ఇప్పుడు డీఎంకే అసంతృప్తికి కారణమైంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media