2026లో టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. కానీ మన ఆలోచనలు మాత్రం ఇంకా మధ్యయుగాల దగ్గరే ఆగిపోయాయా అన్న ప్రశ్న మళ్లీ ముందుకొస్తోంది. చదువుకున్న కుటుంబాలు.. పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు.. సమాజంలో గౌరవం ఉన్నవాళ్లు కూడా కట్నం కోసం కోడళ్లను వేధించడం ఆగడం లేదు.
మధ్యప్రదేశ్ భోపాల్కి చెందిన ట్విషా శర్మ.. యూపీలోని గ్రేటర్ నోయిడాకి చెందిన దీపికా నగర్ వంటి మహిళలు.. వేధింపుల కారణంగా ప్రాణాలు బలితీసుకున్న ఘటనలు నేటి సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఒకప్పుడు ఇవి అరుదుగా జరిగేవి అనుకునే వాళ్లం. కానీ ఈ ఆధునిక కాలంలోనూ ప్రతి ఏడాది వేలాది మంది మహిళలు కట్న వేధింపులకు బలవుతున్నారు.
డిగ్రీలు ఉన్నా.. విలువలు లేకపోతే?
ఎంత చదువుకున్నా.. ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా.. మానవత్వం లేకపోతే ఆ చదువుకు అర్థమేంటి? డిగ్రీలు సంపాదించిన వాళ్లే.. కట్నం కోసం ఆశపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. చదువు మనిషిని మార్చాలి. కానీ కొందరిలో అది కేవలం ఉద్యోగం వరకే పరిమితమవుతోంది. ఇక్కడ మారాల్సింది అత్తింటివాళ్లు మాత్రమే కాదు. తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి. మీ కూతురు అత్తింట్లో నరకం అనుభవిస్తోందని తెలిసినా.. “సమాజం ఏమంటుంది?”, “కొంచెం సర్దుకుపో”, “కాపురం కాపాడుకో” అంటూ ఆమెను మానసికంగా ఒత్తిడికి గురి చేయొద్దు.
విషపూరితమైన బంధంలో బతకమని ఒత్తిడి చేయడం కంటే.. అక్కడి నుంచి బయటకు రావడానికి ధైర్యం ఇవ్వాలి. కూతురి ప్రాణం కంటే సమాజం పెద్దది కాదు. కట్న వేధింపులు నేరం మాత్రమే కాదు.. మన సమాజం ఇంకా ఎంత వెనుకబడి ఉందో చూపించే చేదు నిజం.

