షామీర్పేట పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసిన వారిని పరామర్శించిన ఎంపీ
డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్
జవహర్ నగర్ డంప్ యార్డ్పై మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: జవహర్ నగర్ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ సభ్యులు, స్థానిక ప్రజలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. శనివారం (జూలై 11) షామీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన అరెస్టు చేసిన వారిని కలిసి పరామర్శించారు. అనంతరం వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యపై పోరాడారని గుర్తు చేశారు.
ఈ సమస్య అన్యాయమని చెబుతూ సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారని అన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
డంప్ యార్డును తరలించి, తనను ఎంపీగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు.
రెండు కోట్ల మంది చెత్త ఒకే ప్రాంతంలో పడేస్తున్నారు
ఒకప్పుడు జవహర్ నగర్ ప్రాంత ప్రజల చెత్త మాత్రమే అక్కడ వేస్తుండేవారని ఈటల తెలిపారు. ప్రస్తుతం GHMC పరిధిలోని దాదాపు రెండు కోట్ల మంది చెత్తను జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్కు తరలిస్తున్నారని చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా ఒకే ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో చెత్త వేయరని వ్యాఖ్యానించారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కాలుష్యంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు
డంప్ యార్డ్ వల్ల లీచేట్ నీరు భూగర్భ జలాల్లో కలుస్తోందని ఈటల ఆరోపించారు. అనేక ఉద్యమాల తర్వాత లీచేట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పినా పూర్తి స్థాయిలో అమలు జరగలేదని విమర్శించారు.
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించినా, రోజుకు వచ్చే దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్తలో కేవలం 3,500 మెట్రిక్ టన్నులకే ప్రాసెసింగ్ జరుగుతోందని తెలిపారు.
మిగిలిన 6,500 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజూ పేరుకుపోతుందని అన్నారు.
దీనివల్ల బాలాజీ నగర్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, ఘట్కేసర్ వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు భరించలేని దుర్వాసన మధ్య జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
డంప్ యార్డ్ సమస్యపై ధర్నా చేస్తామని ప్రకటించిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ సభ్యులను తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇళ్ల నుంచి అదుపులోకి తీసుకెళ్లారని ఈటల ఆరోపించారు.
కీసర, ఘట్కేసర్, షామీర్పేట, బొల్లారం, తుకారంగేట్ పోలీస్ స్టేషన్లలో వందల మందిని నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పునే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు.
అరెస్టులు కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి
అరెస్టులు, కేసులు సమస్యకు పరిష్కారం కాదని ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజల సమస్యను అర్థం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
నగరంలో ఒకే ప్రాంతంలో చెత్తను వేయకుండా, వివిధ ప్రాంతాల్లో శాస్త్రీయ విధానంలో డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జీరో పొల్యూషన్ సాంకేతికతతో చెత్తను శుద్ధి చేసి ఉపయోగకరంగా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వానికి సూచించారు.
అందరినీ వెంటనే విడుదల చేయాలి
డంప్ యార్డ్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిని అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నించడం వెర్రిబాగుల ఆలోచన అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఉద్యమాలను అరెస్టులతో అణచివేయలేరని స్పష్టం చేశారు.
అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాలను జీరో చెత్త, జీరో కాలుష్య ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.



