పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ప్రేమ వివాహం చేసుకున్న యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

పాతూరుకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి (22) మృతి మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి మృతురాలి తండ్రి చంద్రశ్రీను సహా కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
చౌడేశ్వరి మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజుతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లికి తండ్రి అంగీకరించకపోవడంతో, కోపంతో కూతురిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.నిందితుడు తన మేనల్లుడితో కలిసి కూతురిని గొంతు నులిమి చంపి, అనంతరం ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా మాయ చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ కేసులో సంబంధిత వారిని పోలీసులు విచారిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
