వడోదర నుంచి ముంబైకి ఎండీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
విమానయాన రంగంలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది.
గుజరాత్లోని వడోదర నుంచి ముంబైకి దాదాపు రూ.30 లక్షల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ) డ్రగ్స్ను తరలిస్తున్న మాజీ ఎయిర్హోస్టెస్తో పాటు ఆమె సహచరుడిని సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
వారి నుంచి 977 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో తనిఖీలు
వడోదర నుంచి ముంబైకి కారులో భారీగా డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారం సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది.
దీంతో సూరత్ గ్రామీణ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సహకారంతో పాల్సానాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఉన్న ఏనా గ్రామ టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు.
అనుమానాస్పదంగా వస్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
కారులో డ్రగ్స్ ప్యాకెట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
977 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం
కారులో ఉన్న వారిని ముంబై శాంతాక్రూజ్కు చెందిన మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు మాన్సీ అబ్దుల్ సయ్యద్ (41), సోహెల్ సులేమాన్ షేక్ (20)గా పోలీసులు గుర్తించారు.
వారి వద్ద నుంచి 977 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు రూ.29.32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
వడోదర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ ఈ డ్రగ్స్ ప్యాకెట్ను తమకు ఇచ్చిందని నిందితులు విచారణలో చెప్పారు.
ముంబైలోని పెడ్లర్లకు పంపిణీ చేసేందుకు వాటిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
గతంలోనూ డ్రగ్స్ కేసు
మాన్సీకి గతంలోనూ డ్రగ్స్తో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
2015లో ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న సమయంలోనే ఆమె డ్రగ్స్కు అలవాటు పడినట్లు చెప్పారు.
ఆ తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడిందని వెల్లడించారు.
2021లో ఇండోర్ పోలీసులు మాన్సీని 100 గ్రాముల ఎండీ డ్రగ్స్తో అరెస్ట్ చేశారు.
పిల్లల డైపర్లలో డ్రగ్స్ దాచి తరలిస్తుండగా ఆమె పట్టుబడింది. ఈ కేసులో దాదాపు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించింది.
ప్రస్తుతం మాన్సీ, సోహెల్పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



