రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. BRS నేత, జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి తన భర్త మరియు అనుచరులతో కలిసి BJPలో చేరారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వారికి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామని బండి సంజయ్ ప్రకటించారు. స్మార్ట్ సిటీ, అమృత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారానే కరీంనగర్ అభివృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల కోసం “అభివృద్ధే మా విధానం.. హిందుత్వమే మా నినాదం” అనే సరికొత్త నినాదాన్ని ఆయన ప్రకటించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఒక్క పైసా ఇవ్వలేదని, ఎన్నికలు రాగానే హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే గెలిచాక ఫిరాయింపులకు పాల్పడతారని, ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు.
BJPని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులతో పాటు సి.ఎస్.ఆర్ (CSR) నిధులను కూడా తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ డి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
