చేనేతలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి గడువు పెంచాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. జిల్లాలో ఇంకా అనేక మంది చేనేత కార్మికులు అప్లికేషన్లు సమర్పించలేకపోయారని సంఘం నేతలు తెలిపారు.

జమ్మలమడుగులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డక్కా ఓబులేష్, కార్యదర్శి వీరణాల శివనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేతి మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.అయితే, అప్లికేషన్ గడువును ఏప్రిల్ 15 వరకు మాత్రమే పరిమితం చేయడం వల్ల చాలా మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోలేకపోయారని విమర్శించారు. గ్రామాల్లో సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం, ప్రచారం లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.జిల్లాలో వేల సంఖ్యలో మగ్గాలు ఉన్న నేపథ్యంలో, ఈ పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ గడువును పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రతి చేనేత కార్మికుడికి ₹25,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
