ATMలకు నగదు సరఫరా చేసే వాహనం నుంచి రూ. 34.90 లక్షలతో పరారైన డ్రైవర్ను గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు అజిత్ (34)ను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద అదుపులోకి తీసుకున్నట్లు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ వెల్లడించారు.

ఈ నెల 12న గోపన్పల్లి తండాలో ఏటిఎంలలో నగదు లోడ్ చేయడానికి వెళ్లిన సమయంలో, సిబ్బంది లోపలికి వెళ్లగానే డ్రైవర్ అజిత్ వాహనంలోని నగదుతో ఉడాయించాడు. తెల్లాపూర్ వద్ద ఆటో ఎక్కి హైదరాబాద్లోని ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. ఆ తర్వాత పోలీసుల కళ్లు గప్పి అనంతపురం, బళ్లారి, పూణే, బెంగళూరు వంటి నగరాల్లో తిరుగుతూ కాలక్షేపం చేశాడు.నిందితుడిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో అతడి కదలికలను ట్రాక్ చేశారు. విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు పారిపోయే క్రమంలో ఎయిర్పోర్ట్ వద్ద దొరికిపోయాడు. నిందితుడు తన వద్ద ఉన్న నగదులో రూ. 22 లక్షలను జల్సాలకు ఖర్చు చేసినట్లు ఒప్పుకున్నాడు. మిగిలిన రూ. 34.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు రవాణాలో నిర్లక్ష్యం వహించిన సదరు ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
