గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ఏనమదల గ్రామ పరిధిలోని కాటూరి మెడికల్ కాలేజ్ సమీప చెరువులో లభించిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన హత్యగా తేల్చి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
చెరువు వద్ద రక్తంతో తడిసిన గోతం కనిపించడంతో కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, విచారణలో షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మృతుడు తన్నీరు వెంకటేశ్వర్లు (30)ను అతని భార్య ఉప్పుతల లక్ష్మి (A1) మరో ముగ్గురు సహచరులతో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు.భర్త తరచూ మద్యం సేవించి తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడన్న కారణంతో లక్ష్మి ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వెంకటేశ్వర్లును ఒక స్తంభానికి కట్టేసి కొట్టడంతో అతను మృతి చెందాడు.తర్వాత మృతదేహాన్ని ఇంట్లో పూడ్చిపెట్టాలని యత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో, గోతంలో కట్టి రాయిని బిగించి చెరువులో పడేశారని ఎస్పీ వెల్లడించారు. సమాచారం మేరకు పారిపోతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ కేసులో A2 సిద్ధి సురేష్, A3 సిద్ధి అంకమ్మ, A4 ఓంకార్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
