జూన్ 19 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ భారీ వర్షాలు వారం రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచనలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నైరుతి రుతుపవనాలు జూన్ 8న జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి, జూన్ 14 నాటికి దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరించాయి. ఇవి రానున్న మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 18-20 తేదీల మధ్య హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


