మహిళలు, చిన్నారుల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆడపిల్లల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మంగళవారం శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీల ఆరోపణలను తిప్పికొడుతూ ఆమె కీలక గణాంకాలను వెల్లడించారు.

గత ఏడాది కంటే మహిళలపై అత్యాచారాలు, హత్యలు 4 శాతం తగ్గాయని మంత్రి ప్రకటించారు. పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకముందే శిక్షలు పడేలా చేశామన్నారు. 506 మందికి శిక్షలు పడగా, అందులో 9 మందికి మరణశిక్ష, 169 మందికి జీవితఖైదు పడిందని వెల్లడించారు. గంజాయిని అరికట్టేందుకు ‘ఈగిల్’ (EAGLE) టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సాగును జీరో చేశామని, డోర్ డెలివరీ చేసే నేరగాళ్ల కుటుంబ సభ్యులపై కూడా నిఘా పెట్టామని స్పష్టం చేశారు. మదనపల్లిలో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, నేరగాళ్లకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. గతంలో గంజాయికి అడ్డాగా ఉన్న ఏపీ, నేడు గంజాయిని ఎలా అరికట్టాలో దేశానికి పాఠాలు చెబుతోందని.. స్కూల్ పిల్లలే ‘గంజాయి వద్దు బ్రో’ అంటూ ప్రచారం చేస్తున్నారని గర్వంగా చెప్పారు.
