దేశ రక్షణలో మాజీ సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. బుధవారం విజయవాడలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ‘వెటరన్స్ డే’ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, సైనిక వీరుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సరిహద్దుల్లోనే కాకుండా, సమాజంలో విపత్తులు సంభవించినప్పుడు మాజీ సైనికులు చూపే తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. యువత మాజీ సైనికుల క్రమశిక్షణను, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
