మహిళా భద్రత వారోత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. సత్యనారాయణపురం సిగ్నల్ నుండి శివాజీ గేటు వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళా భద్రతపై నినాదాలు చేస్తూ చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి ‘శక్తి టీమ్’ బ్రోచర్ను ఆవిష్కరించారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ఎన్డీయే ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని హోం మంత్రి వెల్లడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, ఆస్తిలో సమాన వాటా హక్కును ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు. ఆడ, మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని, మగపిల్లలకు మహిళలను గౌరవించే సంస్కారాన్ని నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ‘సెక్సువల్ అఫెండర్ షీట్’ ఓపెన్ చేసి, కఠిన నిఘా ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఐజి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని, ప్రతి ఆడపిల్లకూ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని అందించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

