సైబర్ నేర బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ (Cyber-Mitra) పేరుతో వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే నేరుగా తమ ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసుకోవచ్చు.

బాధితులు 1930 నంబర్కు లేదా జాతీయ సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన వెంటనే, సీ-మిత్ర బృందంలోని వర్చువల్ ఆఫీసర్లు వారిని సంప్రదిస్తారు. బాధితులకు చట్టపరమైన సెక్షన్లపై అవగాహన ఉండదు కాబట్టి, కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో పక్కాగా ఫిర్యాదు పత్రాన్ని పోలీసులే సిద్ధం చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బాధితులు ఆ డ్రాఫ్ట్ను ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్ ద్వారా లేదా బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పీఎస్ వద్ద ఉన్న డ్రాప్ బాక్స్లో వేస్తే సరిపోతుంది. ఆ వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ మొబైల్కు వస్తుంది.

రూ. 3 లక్షల లోపు ఉన్న కేసులను ‘జీరో ఎఫ్ఐఆర్’ చేసి స్థానిక స్టేషన్లకు, ఆ పైన ఉన్న కేసులను నేరుగా సైబర్ క్రైమ్ పీఎస్ దర్యాప్తు చేస్తుంది. సీ-మిత్ర అధికారిక నంబర్ 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. పోలీసులు ఎప్పుడూ ఓటీపీలు లేదా డబ్బులు అడగరని కమిషనర్ స్పష్టం చేశారు.
