డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి నకిలీ కరెన్సీ కట్టలు ఇచ్చిన నిందితులు
గతంలోనూ ఇలాంటి కేసుల్లో పాల్గొన్న అలవాటు నేరస్థుడు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్: డబ్బు రెట్టింపు చేస్తామని ఆశ చూపించి ఓ వ్యక్తిని రూ.1 లక్ష మోసం చేసిన ముగ్గురు నిందితులను తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.అసలు రూ.500 నోట్లలా కనిపించే పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి ఈ Fraud కి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం..
తుర్కపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తిని నిందితులు సంప్రదించారు. రూ.1 లక్ష ఇస్తే రూ.2 లక్షలు ఇస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పల్లెపహాడ్ స్టేజ్ వద్ద రూ.1 లక్ష నగదు అప్పగించాడు.
ఆ తర్వాత నిందితులు ఇచ్చిన కట్టలను పరిశీలించగా పైభాగం, కిందభాగంలో మాత్రమే అసలు రూ.500 నోట్లు ఉన్నాయి.
మధ్యలో ఉన్నవన్నీ “Children’s Bank of India – Specimen” అని ముద్రించిన పిల్లల ఆట కరెన్సీ నోట్లు అని గుర్తించాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకుని తుర్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అలవాటు నేరస్థుడిగా యాకంబరం గుర్తింపు:
దర్యాప్తులో ఉడుమ్రకోల యాకంబరం అలవాటు నేరస్థుడని తేలింది. గతంలో సుబేదారి, నర్సంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఇలాంటి నకిలీ కరెన్సీ మోసం కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అప్పట్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన అతడు విడుదలైన తర్వాత మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
తుర్కపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ తఖియుద్దీన్ మాట్లాడుతూ..
సులభంగా డబ్బు వస్తుందని చెప్పే ఆఫర్లు,తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందనే పథకాలు,అనుమానాస్పద కరెన్సీ మార్పిడి ప్రతిపాదనలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.
నకిలీ డబ్బు పేరుతో పెరుగుతున్న మోసాలు:
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు కొందరు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
అసలు కరెన్సీలా కనిపించే నకిలీ లేదా పిల్లల ఆట నోట్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
అనుమానాస్పద ఆఫర్లు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరణ లేకుండా నగదు లావాదేవీలు చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.



