భర్త, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్లో ఆమె మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది.
ప్రేమించి పెళ్లి.. వ్యసనాలపై తరచూ గొడవలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూ నగర్కు చెందిన వందనా కుష్వాహా, ఉపేంద్ర పటేల్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
అయితే పటేల్కు ఉన్న వ్యసనాల కారణంగా వందన కుటుంబం నెహ్రూ నగర్ నుంచి రాజ్నగర్కు మకాం మార్చింది.
అయినప్పటికీ ఆగస్టు 11న కుటుంబ సభ్యులను కాదని వందన, ఉపేంద్ర పటేల్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ సమయంలో వందన కుటుంబ సభ్యులు చందన్ నగర్ పీఎస్లో మిస్సింగ్ కేసు కూడా పెట్టారు.
వందన మేజర్ కావడంతో తాను భర్తతోనే ఉంటానని చెప్పింది.
దీంతో పటేల్తో కలిసి నెహ్రూ నగర్లో కాపురం పెట్టింది.
అయితే పటేల్ వ్యసనాలపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
ఇంట్లో నుంచి కేకలు.. ఆ తర్వాత రక్తపు మరకలు
గురువారం మధ్యాహ్నం వందన ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వేయడం ఇరుగుపొరుగు వారు విన్నారు.
కొద్దిసేపటికే భర్త పటేల్ చొక్కాపై రక్తపు మరకలతో బయటకు రావడాన్ని వారు గమనించారు.
ఆ తర్వాత ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు రౌ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో, పరిసరాల్లో గాలింపు చేపట్టారు.
వాటర్ ట్యాంక్లో వందన మృతదేహం
గాలింపు సమయంలో ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్లో వందన మృతదేహం కనిపించింది.
మృతదేహంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
“ప్రాథమిక విచారణలో ఇది హత్యగానే కనిపిస్తోంది.
పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి” అని ఏసీపీ నిధి సక్సేనా తెలిపారు.
ప్రస్తుతం మృతురాలి భర్త ఉపేంద్ర పటేల్, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లయిన 25 రోజులకే నవవధువు మృతదేహం వాటర్ ట్యాంక్లో లభించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.



