IPS అధికారి సునీల్ నాయక్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన బహిరంగ ప్రకటన AP రాజకీయ, పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను ఉద్దేశపూర్వకంగానే కేసుల్లో ఇరికించారని, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి ఉన్నత పదవిలో ఉండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2021 నాటి ఘటనలో 2024లో తన పేరును చేర్చారని, మాజీ సీఎం మరియు పీవీ సునీల్ కుమార్లకు వ్యతిరేకంగా మాట్లాడాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రఘురామ కృష్ణంరాజు (RRR) కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంతమందిని బెదిరించారో నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. తన తల్లి మరుగుదొడ్డికి వెళ్తుంటే అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, ఒక ఐపీఎస్ అధికారి తల్లికే రక్షణ లేని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. భూ దందాలు, ఇసుక, గ్రానైట్ మాఫియాపై విచారణ చేయకుండా, తన లాంటి లంబాడి కులస్థుడిని టార్గెట్ చేయడం వెనుక కుల వివక్ష ఉందని ధ్వజమెత్తారు. తన వద్ద అన్ని ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయని, సరైన సమయంలో బయటపెడతానని స్పష్టం చేశారు.
