దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక వార్డు సభ్యుడు సతీశ్ కుమార్ తల్లిదండ్రులపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. గ్రామస్థులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక దొంగను పట్టుకోగా, ఇద్దరు పరారయ్యారు.
అర్ధరాత్రి సమయంలో వార్డు సభ్యుడు సతీశ్ కుమార్ నివాసంలోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. లోపల ఉన్న రుకుంబాయి, కిష్టయ్యలపై కత్తితో దాడి చేసి, డమ్మీ తుపాకీతో బెదిరించారు. బాధితుల కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి తలుపులు తట్టారు. దీంతో భయపడిన దొంగలు బయటకు పారిపోతుండగా, గ్రామస్థులు వెంబడించారు. పారిపోతున్న వారిలో ఒకడిని గ్రామ శివారులో స్థానికులు పట్టుకుని చితకబాదారు. విచారణలో నిందితుడు మాచారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రజినీకాంత్ గా తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారైన మిగిలిన ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
