రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన సత్తా చాటనుంది. ఏపీ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతోందని ఆ పార్టీ కామారెడ్డి ఇంచార్జి లక్ష్మీనర్సాగౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం పలువురు అభ్యర్థులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

కామారెడ్డిలోని 15 నుంచి 16 వార్డుల్లో జనసేన పోటీ చేస్తుందని, ఇప్పటికే 9 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇస్తామని, ఇతర పార్టీల నుంచి జనసేనలోకి భారీగా వలసలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకుని ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కొండగట్టుకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన తర్వాత తెలంగాణలో పార్టీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
