ONGC కార్యకలాపాల వల్ల తమ ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందంటూ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. నిత్యం జరుగుతున్న ఓఎన్జీసీ పనుల వల్ల గ్రామంలో కాలుష్యం పెరుగుతోందని, సామాన్యుల రోజువారీ జీవితం అతలాకుతలమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓఎన్జీసీ డ్రిల్లింగ్ మరియు ఇతర కార్యకలాపాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ గ్రామంలో ఓఎన్జీసీ పనులను నిలిపివేయాలని లేదా తమకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
