ధనవంతుడైనా, సాఫ్ట్వేర్ ఇంజనీరైనా, రాజకీయ నాయకుడైనా సరే.. ఆ గ్రామ దేవత ముందు అందరూ సమానమే. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఆరు తరాలుగా సాగుతున్న సత్యమ్మ తల్లి జాతర భక్తికి, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ భక్తులు భిక్షాటన చేసి మొక్కులు తీర్చుకోవడం విశేషం.ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు విచిత్ర వేషధారణలతో జోలె పట్టుకుని ఇంటింటికీ తిరిగి భిక్షం ఎత్తుకుంటారు. అలా సేకరించిన ధనాన్ని మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా, కానుకగా సమర్పిస్తారు.
సత్యమ్మ తల్లిని ‘కర్రీ’ వారి ఇంటి ఆడపడుచుగా గ్రామస్తులు భావిస్తారు. మహిళలను ఆదిశక్తిగా పూజించే ఈ గ్రామంలో ఈ సంప్రదాయం ఆరు తరాలుగా కొనసాగుతోంది.ఉద్యోగ, వ్యాపార రీత్యా అమెరికా, లండన్ వంటి దేశాల్లో స్థిరపడిన వారు సైతం జాతర సమయానికి సొంత ఊరికి చేరుకుంటారు. తమ హోదాను పక్కన పెట్టి బంధుమిత్రుల వద్ద భిక్షం అడిగి మొక్కులు చెల్లించుకుంటారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఒకేలా భిక్షాటన చేయడం ద్వారా.. దైవం ముందు అందరూ సమానమేనన్న సత్యాన్ని ఈ జాతర చాటిచెబుతోంది.భక్తి, విశ్వాసం మరియు పురాతన సంప్రదాయాల సమ్మేళనంగా సాగుతున్న ఈ సత్యమ్మ తల్లి జాతరను చూసేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు
