LB Nagar పరిధిలోని హయత్నగర్ లక్ష్మీప్రియ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీ అధ్యక్షుడు మధు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు మరియు బోడ యాదగిరి అనే వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో ఈ దారుణానికి పాల్పడ్డానని మధు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన మధును నకిరేకల్లో జరిగిన ఒక ఫంక్షన్ నుండి పోలీసులు తీసుకువచ్చి మళ్లీ వేధించారని, ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన మరణానికి బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణతో పాటు పోలీసులు కారణమని సూసైడ్ లెటర్లో మధు స్పష్టం చేశాడు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు, స్థానికులు యాదగిరి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా బాధిత కుటుంబ సభ్యులు ధర్నా కొనసాగించారు.సూసైడ్ నోట్లో మరో ఇద్దరి పేర్లు కూడా ప్రస్తావించడంతో కేసు మరింత కీలకంగా మారింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
